మద్యానికి బానిస కావడం వ్యక్తిగత పతనం ఏ మాత్రం కాదని, దాన్నొక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా చూడాలని బాలీవుడ్ భామ జాన్వీకపూర్ అన్నారు. ఇటీవల ఓ సెమినార్లో పాల్గొన్న జాన్వీ.. ఈ విషయం గురించి మాట్లాడుతూ ‘మద్యానికి బానిసైన వాళ్ల క్యారక్టర్ని తక్కువ చేసి మాట్లాడటం సరైన పద్ధ్దతి కాదు. నిజానికి ఏ వ్యసనమైనా విలాసం కాదు. అదొక మానసిక రుగ్మత. ఒత్తిడి, ఆందోళన, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల చాలామంది అనుకోకుండా వ్యసనాలకు లోనవుతుంటారు. సమాజం వారిని నేరస్థుల్లా కాకుండా.. చికిత్స అవసరమైన రోగుల్లా గుర్తించాలి. విమర్శించడం, దూరం పెట్టడం చేయకుండా, ప్రేమను పంచాలి. సమాజం నుంచి సానుభూతి, మద్దతు లభించినప్పుడే అలాంటివారు త్వరగా కోలుకోగలరు’ అని చెప్పుకొచ్చింది జాన్వీకపూర్. సున్నితమైనఇలాంటి సామాజిక అంశంపై స్పష్టమైన అవగాహనతో జాన్వీ కపూర్ మాట్లాడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.