సూర్య కథానాయకుడిగా నటించిన ‘జైభీమ్’ చిత్రం ఆస్కార్కు నామినేట్ అయ్యింది. 94వ ఆస్కార్ పురస్కారాల బరిలో ఉత్తమ చిత్రం జాబితాలో 276 సినిమాలు పోటీపడుతున్నాయి. ఇందులో ఇండియా నుంచి ‘జైభీమ్’తో పాటు మోహన్లాల్ ‘మరక్కార్’ చోటు దక్కించుకున్నాయి. చెన్నై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు జీవితం ఆధారంగా సామాజిక ఇతివృత్తంతో దర్శకుడు టీజే జ్ఞానవేళ్ ‘జైభీమ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో సూర్య నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కాగా పదహారవ శతాబ్దానికి చెందిన నావికా దళాధిపతి కుంజలి మరక్కార్ జీవితంతో తెరకెక్కిన ‘మరక్కార్’ చిత్రం రెండు జాతీయ అవార్డులను అందుకున్నది. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన సినిమాలో మోహన్లాల్, అర్జున్, కీర్తిసురేష్ కీలక పాత్రల్ని పోషించారు. ఆస్కార్ తుది నామినేషన్ జాబితాను ఫిబ్రవరి 8న ప్రకటించబోతున్నారు.