సూర్య ఈ మధ్య వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాడు. ఆయన నటించిన ఆకాశమే హద్దురా చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తాజాగా జై భీమ్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. 1995లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా అత్యంత సహజంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ఈ సినిమాను జస్టిస్ చంద్రు జీవితం ఆధారంగా తెరకెక్కించారు.
ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎమ్డీబీ సినిమాల జాబితాలో జై భీమ్ ఏకంగా మొదటి స్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది. సుమారు 53,000 ఓట్లు, 9.6 రేటింగ్తో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది.దళిత వర్గానికి చెందిన వారిపై పోలీసులు ఎలాంటి దాష్టికాలకు పాల్పడ్డారు అన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించగా, ఇందులో సూర్య లాయర్ పాత్రలో తన నట విశ్వరూపం చూపించారు.
జై భీమ్ సినిమాపై సామాన్యులు, సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి అరుదైన గుర్తింపు లభించింది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ పురస్కారానికి నామినేట్ అయింది ‘జై భీమ్’. వచ్చే ఏడాది జనవరిలో లాస్ ఏంజెల్స్ వేదికగా ఈ అవార్డులను అందించనున్నారు. ఆస్కార్ అవార్డ్ తర్వాత అంతర్జాతీయ చలన చిత్ర రంగంలో గోల్డెగన్ గ్లోబ్ పురస్కారాలని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు అనే సంగతి తెలిసిందే.