ప్రముఖ నటుడు జగపతిబాబు లీడ్ రోల్ పోషిస్తున్న సస్పెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘వదలా’. లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రధారులు. ఆకెళ్ల .వి కృష్ణ దర్శకుడు. కిశోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాతలు. ఈ నెల 17న సినిమా విడుదల కానున్నది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ‘చాలా రోజుల తర్వాత నేను సోలోగా చేసిన సినిమా ఇది. ఈ థ్రిల్లర్ సినిమాలో నాకు ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారు. ‘వదలా’ అనేది క్యాచీ టైటిల్. ఈ సినిమా కథపై నాకు అపారమైన నమ్మకం. టైటిట్కి తగ్గట్టే ఈ సినిమా మిమ్మల్ని వదలదు.
ఇది మంచి ఫ్యామిలీ థ్రిల్లర్. అలాగే మంచి డ్రామా కూడా ఉంది. తప్పకుండా సినిమా అందర్నీ అలరిస్తుంది’ అని జగపతిబాబు నమ్మకం వెలిబుచ్చారు. జగపతిబాబుతో మళ్లీ నటించడం పట్ల నటి లయ ఆనందం వ్యక్తం చేశారు. తమ సంస్థలో ఎన్నో చిత్రాలు నిర్మించామని, తొలిసారి థ్రిల్లర్ చేశామని, ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నామని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ మొత్తం జగపతిబాబేనని, ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారని, కథ, కథనం, విషయాల్లోనే కాక, సాంకేతికంగా కూడా సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని దర్శకుడు ఆకెళ్ల వి.కృష్ణ నమ్మకంగా చెప్పారు. ఇంకా హృతికా శ్రీనివాస్ కూడా మాట్లాడారు.