Chiranjeevi | చేజార్చుకున్న అంగుళీకం కోసం భూలోకానికి ఏతెంచిన ఇంద్రజ.. గైడ్ రాజు ప్రేమలో పడి, చివరకు దేవలోకాన్ని కూడా వదులుకుంది. తన ప్రేమకు అడ్డుగా ఉన్న అంగుళీకాన్ని సముద్రంలోకి విసిరి కొట్టింది. జలధి పాలైన ఆ అంగుళీకాన్ని ఓ మత్స్యం మింగింది. ప్రస్తుతానికి సినిమా సుఖాంతమైంది. ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ ైక్లెమాక్స్ ఇది. ‘మరి ఆ తర్వాత ఏమైంది?’ అని ఏ కథకుడైనా ఆలోచిస్తే!? ఇది ఈనాటి కోరిక కాదు, కోట్లాది అభిమానుల దశాబ్దాల ఆకాంక్ష. ఆ మాటకొస్తే.. చిరంజీవి కోరిక కూడా అదే. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని వెల్లడించారు మెగాస్టార్. ‘ఆ సినిమాకు సీక్వెల్ రావాలి. అందులో రామ్చరణ్, జాన్వీకపూర్ నటించాలి.
నేను చూడాలి. ఇది నా చిరకాల కోరిక.’ అంటూ తెలిపారు చిరంజీవి. నిజానికి ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ సీక్వెల్పై కొన్నేళ్లుగా గాసిప్పులు వస్తూనే ఉన్నాయి. రామ్చరణ్ హీరోగా చేస్తున్నారనీ, ఈ సినిమా ద్వారానే జాన్వీకపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారని గతంలో వార్తలు కూడా వచ్చాయి. కానీ ‘దేవర’తో ఆమె టాలీవుడ్ ఎంట్రీ జరిగిపోయింది. అంతేకాదు, బుచ్చిబాబు సాన చిత్రంతో రామ్చరణ్తో కూడా జతకట్టేసింది. దాంతో దాదాపుగా ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ టాపిక్కి తెరపడ్డట్టయ్యింది. అయితే.. చిరంజీవి మళ్లీ ఈ విషయాన్ని లేవనెత్తడం అభిమానుల్లో చర్చకు తెర లేచింది. ఏది ఏమైనా చిరంజీవి నిజంగా పూనుకుంటే అది పెద్ద పనేంకాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.