ముంబై: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్( Jacqueline Fernandez ) నాలుగోసారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కాలేదు. రూ.200 కోట్ల మోసం కేసుకు సంబంధించి ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది. గత శుక్రవారమే హాజరు కావాల్సి ఉండగా.. ఆమె రాలేదు. తర్వాత శనివారం, సోమవారం కూడా జాక్వెలిన్ డుమ్మా కొట్టింది. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాలేకపోతున్నట్లు ఈడీ అధికారులకు జాక్వెలిన్ చెప్పడం విశేషం. ఈ మోసం కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్తో ఆమెకు ఉన్న సంబంధం, ఆమె ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ జరుపుతోంది.
వచ్చే నెల తొలి వారానికి విచారణను వాయిదా వేయాలని గత శుక్రవారం జాక్వెలిన్.. ఈడీ అధికారులను కోరినా వాళ్లు అందుకు నిరాకరించారు. గతంలో ఒకసారి ఇదే కేసులో జాక్వెలిన్ స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేసింది. తాను ఏ తప్పు చేయలేదని, తాను కూడా సుకేశ్ చంద్రశేఖర్ బాధితురాలినే అని ఆమె ఆ విచారణలో తెలిపింది. ఇదే కేసుకు సంబంధించి మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.