Jackie Bhagnani | బాలీవుడ్ ప్రొడ్యూసర్, నటి రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ తన ఆర్థిక పరిస్థితి గురించి వస్తున్న రూమర్లని ఖండించారు. అతని తాజా చిత్రం ‘బడే మియా ఛోటే మియా’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో, జాకీ దివాలా తీశారనే ప్రచారం జోరుగా సాగింది. తినడానికి డబ్బుల్లేవని, జూహులోని తన ఆఫీస్ను అమ్మేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ ప్రచారాలపై స్పందించిన జాకీ, నేను దివాలా తీశానని, దేశం వదిలి పారిపోయానని, తినడానికి డబ్బుల్లేవంటూ ప్రచారం చేశారు. ఈ రూమర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియదు. కానీ, నా ఆఫీసును నేను అమ్మినట్టు ప్రచారం జరిగింది. నిజానికి నేను అదే ఆఫీసును మళ్లీ కొనుగోలు చేశాను అని చెప్పారు.
‘బడే మియా ఛోటే మియా’ విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై జాకీ ఓపెన్గా మాట్లాడారు. ఈ సినిమా విషయంలో అలీ అబ్బాస్ జాఫర్కి డైరెక్షన్ ఇవ్వడమే ఒక పొరపాటు అని నేను భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా కేవలం రూ. 102 కోట్లు మాత్రమే వసూలు చేయడం వల్ల, జాకీ ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం తన ఆస్తులు తాకట్టు పెట్టాల్సి వచ్చిందని కూడా ఆయన గతంలో పేర్కొన్నారు.ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్లతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా వంటి ప్రముఖులు నటించినా, చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అయితే ఈ పరిస్థితుల్లో ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదు. ఇది కూడా జీవితంలో ఓ పాఠమే అని జాకీ స్పష్టం చేశారు. సినిమా వసూళ్ల గురించి గతంలో మాట్లాడిన ఆయన, బాక్సాఫీస్ వద్ద మా చిత్రం పెట్టిన పెట్టుబడిలో 50 శాతం కంటే తక్కువే రాబట్టింది. ఈ క్రమంలో మేము పడిన బాధ ఎవరికీ అర్థం కాదు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి మా ఆస్తులను కూడా తాకట్టు పెట్టాం అని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు ఈ విషయాలు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కూడా జాకీ భగ్నానీ ఆవేదన వ్యక్తం చేశారు. లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతోనే సినిమా తీశామని, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయామంటూ చాలా బాధపడ్డారు.