Jabardasth hari | ఒక్కోసారి మనం చేయని తప్పుకు కూడా నిందలు పడాల్సి ఉంటుంది. కారణం ఏదైనా అయ్యుండొచ్చు.. కానీ అందరూ మన గురించి తప్పుగా మాట్లాడితే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. ప్రస్తుతం ఇదే పరిస్థితిని అనుభవిస్తున్నాడు జబర్దస్త్ కమెడియన్ హరిత అలీయాస్ హరికృష్ణ. రెండు రోజుల క్రితం హరిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నమోదైంది. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండలం నెక్కుంది గ్రామ శివార్లలో స్కార్పియో, వేగనార్ కార్లలో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కాగా పోలీసులను చూసి రెండు వాహనాలతో దుండగులు తప్పించుకునే ప్రయత్నం చేయగా.. ఒక డ్రైవర్ వాహనంతో తప్పించుకుని పారిపోగా… మరో డ్రైవర్ తిరుపతి కిషోర్ పట్టుబడ్డాడు. అతని నుంచి సమాచారం రాబట్టిన పోలీసులు.. జబర్దస్త్ కమెడియన్ హరి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు
ఈ మేరకు పోలీసులు హరి పేరును మీడియాకు చెప్పారు. కాణిపాకం పోలీస్ స్టేషన్లో ఆయన పేరు నమోదైందని. హరి ఇప్పుడు పరారీలో ఉన్నాడని వెల్లడించారు. అయితే కేసు నమోదైంది హరిబాబుపై. ఇతను గతంలో శకలక శంకర్ టీమ్ లో పనిచేశాడు. దాంతో పోలీసులు హరి అని చెప్పడంతో ప్రస్తుతం జబర్దస్త్ లో కమెడియన్ గా చేస్తున్న హరికృష్ణ అనుకుని మీడియాలో కథనాలు జోరందుకున్నాయి. హరికృష్ణ ఫోటోలు పెట్టి మరీ వార్తలు రాసారు. దీంతో తాజాగా హరికృష్ణ తనపై వస్తున్న వార్తలను ఖండించాడు. కేసు నమోదయ్యింది తనపై కాదని, గతంలో ఇదే జబర్దస్త్ షోలో పనిచేసిన హరికృష్ణపై అని వాపోయాడు. తనను నిందుడిగా చూపిస్తున్నారని, తన ఫ్యామిలీ ఇబ్బంది పడుతోందని హరి చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా స్మగ్లింగ్ కేసు విషయంలో తనను దోషిగా చూపించడం ఇది తొలిసారి కాదని.. గతంలో రెండు సార్లు ఇలానే తనపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పాడు. ఏడేళ్ల కింద ఒకసారి, లాక్ డౌన్ కు ముందు ఒకసారి తనపై ఇలానే వార్తలు రాశారని, ఇప్పుడు మూడో సారి తన ఫోటోలను పెట్టి దోషిగా చూపిస్తున్నారని బాధపడ్డాడు. ఇకనైనా నిజం తెలుసుకుని తనను వదిలేయాలని వేడుకున్నారు.