‘అమాయకులైన గిరిజనులు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. దేశం అభివృద్ధి పథంలో ఉందని చెప్పుకుంటున్నాం కానీ.. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఇప్పటికి మైళ్ల దూరం నడిచి ఆసుపత్రికి వెళ్లాల్సిన దుస్థితిలో ఎన్నో గ్రామాలున్నాయి. ఇలాంటి సమస్యల్ని చర్చిస్తూ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు ఏ.ఆర్.మోహన్. ఆయన దర్శకత్వంలో అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
గురువారం అల్లరి నరేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీజర్ను విడుదల చేశారు. అభివృద్ధికి నోచుకొని మారుమూల పల్లెలకు న్యాయం చేయాలని తపించే కథానాయకుడు, ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే పరిస్థితుల్ని ఆవిష్కరిస్తూ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆనంది కథానాయికగా నటిస్తున్నది. త్వరలో విడుద తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం పేర్కొంది.