‘ఇది జనం సినిమా. మన చుట్టుపక్కల జరిగే కథగా ప్రజల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. నిజాయితీతో చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నా’అని అన్నారు అల్లరి నరేష్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఏ.ఆర్.మోహన్ దర్శకుడు. ఆనంది కథానాయిక. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మించారు. నేడు విడుదల కానుంది. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపే కథాంశమిది. మనచుట్టూ ఇలాంటి కథల్ని ఎన్నో చూస్తుంటాం. ప్రస్తుతం ప్రేక్షకులు కథల్లో నవ్యతను ఇష్టపడుతున్నారు.
ఆ ప్రయత్నంలో భాగంగానే సందేశాత్మక సోషల్డ్రామాగా ఈ సినిమాను తీసుకొస్తున్నాం’ అని చెప్పారు. ‘ఇది సినిమా కాదు. కొందరి బతుకు చిత్రం. హృదయాన్ని కట్టిపడేసే భావోద్వేగాలతో పాటు వినోదం, యాక్షన్ హంగులన్నీ ఉంటాయి’ అని దర్శకుడు ఏ.ఆర్.మోహన్ తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘నిర్మాతగా నా తొలి చిత్రమిది. కథను నమ్మి నిజాయితీగా కష్టపడ్డాం. చక్కటి సందేశంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని చెప్పారు.