హైదరాబాద్: సినీ ప్రముఖుల ఇండ్లలో వరుసగా మూడో రోజూ ఐటీ సోదాలు (IT Raids) కొనసాగుతున్నాయి. పలు సినీ సంస్థలకు ఫైనాన్స్ చేస్తున్న వారి నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ అధికారులు పత్రాలు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా నిర్మాత నెక్కంటి శ్రీధర్ నివాసంతోపాటు ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల ఇండ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.
సోమవారం ఉదయం ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju)తోపాటు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా దిల్ రాజు, మైత్రీ మూవీస్ నిర్వాహకులు యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ బృందాలు తనిఖీలు చేశాయి.
ఇక ఐటీ దాడులపై దిల్ రాజు స్పందించారు. ఐటీ సోదాలు నా ఒక్కడిపైనే జరుగడం లేదని, ఇండస్ట్రీ మొత్తం సోదాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. తాను విజయ్తో తెరకెక్కించిన వారిసు (వారసుడు) సినిమా రూ.120 కోట్లు మాత్రమే వసూళ్లు చేసిందని దిల్ రాజు ఐటీ అధికారులకు చెప్పినట్టు తెలిసింది. అంతేకాదు విజయ్కు రూ.40 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చాం. ఈ సినిమాకు వచ్చిన నష్టాలను పూడ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు రూ.60 కోట్ల నష్టపరిహారం చెల్లించామని చెప్పినట్టు సమాచారం.
సోదాల్లో భాగంగా ఇప్పటికే ఐటీ అధికారులు దిల్ రాజు భార్య తేజస్వినిని బ్యాంక్కు తీసుకెళ్లారు. ఈ విషయమై తేజస్విని మాట్లాడుతూ.. బ్యాంకు వివరాలు కావాలని అధికారులు అడిగారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని చెప్పారు. ఇక, ఇప్పటికే ఐటీ అధికారులు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలు ఆయా సినిమాలకు పెట్టిన పెట్టుబడులు, ఆదాయాలపై ఆరాతీస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.