సీనియర్ కథానాయిక మీనా భర్త విద్యాసాగర్ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల చెన్నైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. భర్త హఠాన్మరణం తాలూకు షాక్ నుంచి మీనా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. శుక్రవారం తన భర్తకు నివాళులర్పిస్తూ మీనా ట్విట్టర్లో భావోద్వేగభరితమైన పోస్ట్ చేసింది.విద్యాసాగర్ మరణం గురించి తప్పుడు కథనాల్ని ప్రసారం చేయొద్దని మీడియాను కోరింది. ‘భర్తను కోల్పోవడం నన్ను దుఃఖసాగరంలో ముంచెత్తింది.
ఈ పరిస్థితిలో మా ప్రైవసీని గౌరవిస్తూ హూందాగా వ్యవహరించాలని మీడియాను కోరుతున్నా. ఈ కష్టకాలంలో నా కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నా భర్తను కాపాడటానికి ప్రయత్నించిన వైద్యులు, అందుకు సహకరించిన ప్రభుత్వ అధికార యంత్రాంగం అందరికి నా కృతజ్ఞతలు’ అని మీనా ట్విట్టర్లో పేర్కొంది.
పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్ అనారోగ్యం బారిన పడ్డారని చెన్నై మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పోస్ట్ కోవిడ్ సమస్యలతో పాటు పావురాల వ్యర్థాల గాలి వల్లే ఆయన ఆరోగ్యం మరింత విషమించిందని వార్తలు ప్రచారం అయ్యాయి. మీడియాలో వచ్చిన కథనాలు మీనాను మానసికంగా ఇబ్బంది పెట్టడంతో ఆమె ట్విట్టర్ ద్వారా ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చిందని అంటున్నారు.