Raviteja | వెబ్ మీడియా, సోషల్మీడియా పెరిగాక, వీటి వేదికగా లేనిపోనివి కల్పించుకొని రాయడం చాలామందికి పరిపాటైపోయింది. ప్రతి విషయాన్నీ బూతద్ధం చూసి రాసేస్తున్నారు. రవితేజ, మలినేని గోపీచంద్ల సినిమా విషయంలో ఇప్పుడు ఇలాంటి వార్తే మీడియాలో హల్చల్ చేస్తున్నది. బ్లాక్బాస్టర్ ‘క్రాక్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమాకు సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్న విషయం విదితమే.
ఇదిలావుంటే ఈ సినిమాకు ప్రస్తుతం బ్రేక్ పడిందని, బడ్జెట్ ఎక్కువ అవ్వడంచేత మైత్రీమూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించలేమని చేతులెత్తేశారని ఉన్నావీ లేనివీ కల్పించుకొని రాసేస్తున్నాయి కొన్ని వెబ్సైట్లు. నిజానికి ఆ వార్తలో నిజం లేదు. ఆ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్వర్క్లో మలినేని గోపీచంద్, సాయిమాధవ్బుర్రా బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్కి వెళ్లనుంది. ఇందులో రవితేజ పాత్ర ‘క్రాక్’ని మించే అత్యంత శక్తిమంతంగా ఉంటుందని విశ్వసనీయసమాచారం.