Karthikeya | ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్ను ‘నాటు నాటు’ పాట గెలవడంతో రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులు సంబురాలు చేసుకుంటున్నారు. లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్ వేదికగా 95వ ఆస్కార్ వేడుకులు అట్టహాసంగా జరిగాయి. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు సాధించింది. షార్ట్ ఫిలిమ్ విభాగంలో భారత్ కు ఇదే తొలి ఆస్కార్ కావడం విశేషం. ఇలా రెండు ఆస్కార్లు ఇండియా గెలుచుకోవడంతో భారతీయ సినీ ప్రేక్షకుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. అయితే ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీకి అధికారికంగా వెళ్లింది. కానీ ఆర్ఆర్ఆర్ మూవీకి అధికారిక ఎంట్రీ లభించలేదు.
దీనిపై పలు విమర్షలు కూడా వెల్లవెత్తాయి. ఆర్ఆర్ఆర్ను ఆస్కార్ ఎంట్రీకి పంపిస్తే ఖచ్చితంగా ఆస్కార్ తీసుకొచ్చేదని పలువురు సెలబ్రెటీలు సైతం వెల్లడించారు. అయితే ఆస్కార్కు అధికారిక ఎంట్రీ లభించలేదని టీమ్ అంతా నిరాశలో ఉన్నప్పుడు.. రాజమౌళి కొడుకు కార్తికేయ జనరల్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ను ఆస్కార్ పంపి క్యాంపెయిన్ చేశాడు. అంతటితో ఆగలేదు. సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిపించాడు. ఈ సినిమాను గ్లోబల్ మార్కెట్కు తీసుకెళ్లడంలో పెద్ద పాత్ర కార్తికేయనే పోషించారు. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ కోసం దగ్గరుండి ప్రమోషన్లు నిర్వహించాడు.