Nani Next Movie | ‘దసరా’తో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు నాని. ఇన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో వచ్చింది. నానికి మాస్ క్యారెక్టర్ పడితే అవుట్ పుట్ ఏ రేంజ్లో ఉంటుందో ఈ సినిమాతో స్పష్టమైంది. మార్చి చివరి వారంలో విడుదలైన దసరా తొలిరోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని కేవలం ఆరు రోజుల్లో వంద కోట్ల క్లబ్లో నిలిచింది.ఈ సినిమాతో నానికి మాస్ ఆడియెన్స్లో యూనివర్సల్ యాక్సప్టెన్స్ దొరికింది. ప్రస్తుతం అదే జోష్తో శౌర్యువ్ అనే కొత్త దర్శకుడితో ఓ ఫ్యామిలీ డ్రామా చేస్తున్నాడు. డిసెంబర్ను టార్గెట్ చేస్తూ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ను శరవేగంగా జరుపుతున్నారు.
ఈ సినిమా తర్వాత నాని చేయబోయే సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. కాగా తాజాగా ఓ మలయాళ దర్శకుడు నానితో సినిమా చేయాలని తెగ ప్రయత్నిస్తున్నాడట. ఇంతకీ ఆ మలయాళ దర్శకుడు ఎవరా? అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు దృశ్యం సిరీస్ దర్శకుడు జీతూ జోసెఫ్. థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన జీతూ జోసెఫ్ ఇటీవలే నానిని కలిసి ఓ లైన్ వినిపించాడట. నానికి కూడా లైన్ బాగా నచ్చిందట. అయితే ఇంకా కంక్లూజన్కు మాత్రం రాలేదట. ప్రస్తుతం జీతూ జోసెఫ్ మోహన్లాల్తో రామ్ అనే సినిమా చేస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.
ఈ సినిమా తర్వాత ముందుగా జీతూ ‘దృశ్యం-3’ తెరకెక్కించాలనుకున్నాడు. మూడో పార్ట్ను మోహన్లాల్, వెంకటేష్, అజయ్ దేవగన్, రవిచంద్రన్లతో ఒకేసారి నాలుగు భాషల్లో తెరకెక్కించి రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నాడు. అయితే దీనికి కాస్త ఎక్కువ టైమ్ పట్టే చాన్స్ ఉంది. నలుగురు హీరోల డేట్స్ అడ్జెస్ట్మెంట్ కావలంటే సమయం పడుతుంది. ఈ లోపు నానితో సినిమా చేయాలని ప్లాన్లో ఉన్నాడట. అయితే నానికి చెప్పిన కథ గతేడాది విడుదలైన ‘కూమాన్’ అని టాక్. పోలీస్ స్టేషన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే కథను తెలుగులో నానితో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.