హుజూరాబాద్ రూరల్, మే 30: దాదాపు ముప్పై ఏండ్ల బీసీ ఉద్యమ ప్రస్థానం కలిగిన డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ను విమర్శించడం ఈటల సతీమణి జమునారెడ్డి అగ్రకుల ధన అహంకారానికి నిదర్శనమని బీసీ సంక్షేమ సంఘం హుజూరాబాద్ మండల అధ్యక్షుడు రావుల అశోక్ ధ్వజమెత్తారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని జూపాక గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2009 ఎన్నికల్లో వకుళాభరణంపై స్వల్ప మెజార్టీతో గెలిచిన ఈటల పరిస్థితిని జమునారెడ్డి మరిచిపోయారని ఎద్దేవా చేశారు. 2018 ఎన్నికల్లో ఈటల తరఫున ప్రచారానికి రావాలని వకుళాభరణం ఇంటి చుట్టూ తిరిగిన సంఘటన గుర్తుకురావడం లేదా అని ప్రశ్నించారు. భూ అక్రమాలపై విచారణ జరుగుతున్న క్రమంలో దాన్ని నిలిపివేయాలని కోర్టులో ఎందుకు పిటిషన్ దాఖలుచేశారని నిలదీశారు.