‘సినిమాల్లోకి రాకముందే నేను రాసిన రెండు నవలలు పబ్లిష్ అయ్యాయి. ‘బసంతి’ చిత్రంతో మాటల రచయితగా నా ప్రయాణం మొదలైంది’ అని చెప్పారు శ్రీకాంత్ విస్సా. రవితేజ కథానాయకుడిగా సుధీర్వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘రావణాసుర’ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ, మాటలందించారు. ఏప్రిల్ 7న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకాంత్ విస్సా మాట్లాడుతూ ‘రవితేజతో పనిచేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది.
మా ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉంటాయి. అందుకే ఆయనతో ఎక్కువ సినిమాలు చేస్తున్నా. ‘రావణాసుర’ ఓ థ్రిల్లర్. పౌరాణిక రావణాసురుడి పాత్రలో ఎన్ని కోణాలుంటాయో అవన్నీ రవితేజ పాత్రలో కనిపిస్తాయి. ఎంటర్టైన్మెంట్తో పాటు ఓ విభిన్నమైన పాయింట్ను టచ్ చేశాం. ప్రతి హీరోలో ఓ విలన్ ఉంటాడన్నదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఓ రోజు రవితేజతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ సినిమా కథ తాలూకు ఐడియా వచ్చింది. తనదైన బాడీలాంగ్వేజ్, సంభాషణలతో రవితేజ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు. దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉంది. ప్రతి రచయిత అంతిమలక్ష్యం అదే. అయితే రచయితగా బిజీగా ఉండటం వల్ల దర్శకత్వానికి మరింత సమయం పడుతుంది. ప్రస్తుతం నేను రచయితగా పనిచేస్తున్న కల్యాణ్రామ్ ‘డెవిల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘టైగర్ నాగేశ్వరరావు’కు మాటలు రాశాను. ‘పుష్ప-2’ కోసం పనిచేస్తున్నా’ అని చెప్పారు.