‘నేను ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగాను. చిన్నతనం నుంచి చూసిన సంఘటనలు, వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథ రాసుకున్నా’ అని చెప్పింది సుజనా రావు. ‘గమనం’ చిత్రం ద్వారా ఆమె దర్శకురాలిగా అరంగేట్రం చేస్తున్నది. శ్రియ, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా సుజనా రావు శుక్రవారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘మూడేళ్ల క్రితం ఈ కథ రాసుకున్నా. జననం నుంచి మరణం వరకు నడిచే జీవన చక్రాన్ని ఇందులో చూపించా. శ్రియ, చారుహాసన్ వంటి సీనియర్స్తో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకున్నా. శ్రియ పాత్ర చిత్రణ గతంలో చూడని విధంగా కొత్త పంథాలో ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు శ్రియ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. సంగీత దర్శకుడిగా ఇళయరాజా కావాలని నిర్మాతల్ని అడగడంతో వారు షాక్ తిన్నారు. ఆయన్ని కలిసినప్పుడు ఓ దేవుణ్ణి చూసిన అనుభూతి కలిగింది. ఈ కథ చెబుతున్నప్పుడు ఆయన ఒక్కసారిగా ‘హే..ఆపు’ అనడంతో నేను టెన్షన్ పడ్డాను. ఆ తర్వాత నా పక్కన వచ్చి కూర్చొని ‘ఓ ఫొటో తీయండి..మేం ఈ సినిమా చేయబోతున్నాం’ అన్నారు. సినిమాల్లోకి రాకముందు డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలు తీశాను. ఏ కథ చెప్పినా మనసుకు హత్తుకునేలా ఉండాలన్నది నేను నమ్మే సిద్ధాంతం. నా తదుపరి సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది’ అని చెప్పింది.