‘వినోదం, థ్రిల్లింగ్ అంశాల సమాహారంగా సాగే చిత్రమిది. సిటీలైఫ్తో పోలిస్తే పల్లెటూరిలో ఆప్తుల మధ్య బతకడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుందని నమ్మే నలుగురు యువకుల కథతో వినోదాత్మకంగా సాగుతుంది’ అని అన్నారు తేజ మార్ని. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా నటించారు. నిరంజన్రెడ్డి, అన్వేష్రెడ్డి నిర్మించారు. ఈ నెల 31న విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో తేజ మార్ని పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘నా స్నేహితుల జీవితాల్లో జరిగిన సంఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ కథ రాసుకున్నా. అర్జున్ అనే యువకుడిగా శ్రీవిష్ణు కనిపిస్తారు. సౌమ్యుడిగా ఉండే అతడు ఫల్గుణుడిగా మారి శత్రువుల్ని ఎలా ఎదుర్కొన్నాడన్నది ఆకట్టుకుంటుంది. ఆనందంగా సాగిపోతున్న ఓ నలుగురు యువకుల జీవనగమనంలో అనుకోని అడ్డంకులు ఎలా ఎదురయ్యాయన్నది ఉత్కంఠను పంచుతుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు మిత్రబృందం ఎన్టీఆర్ అభిమానులుగా కనిపిస్తారు. ఆ అభిమానాన్ని రియలిస్టిక్గానే సినిమాలో చూపించాం. సీనియర్ దర్శకులు వంశీ, కృష్ణవంశీల ప్రభావం నాపై చాలా ఉంది. వారి శైలిలోనే స్వచ్ఛమైన గోదావరి అనుబంధాలను, ఆప్యాయతలను కొత్త కోణంలో ఈ సినిమాలో చూపించా. గోదావరి యాసలో శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. కమర్షియల్ కథాంశంతో తదుపరి సినిమా చేయబోతున్నా. జీఏ2, షైన్స్క్రీన్ బ్యానర్స్లో సినిమాలను అంగీకరించా’ అని తెలిపారు.