‘మేఘ అనే అమ్మాయి జీవిత ప్రయాణం, ప్రేమ విషయంలో ఆమె ఎదుర్కొన్న సంఘటనల్ని హృద్యంగా ఆవిష్కరిస్తూ ‘డియర్ మేఘ’ చిత్రాన్ని రూపొందించాం’ అని చెప్పారు సుశాంత్రెడ్డి. ఆయన నిర్దేశకత్వంలో మేఘాఆకాష్, ఆదిత్అరుణ్, అర్జున్ సోమయాజులు నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం దర్శకుడు పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘దర్శకుడిగా నా ద్వితీయ చిత్రమిది. ఇదొక ముక్కోణపు ప్రేమకథ. కథ అనుకున్నప్పుడే మేఘా ఆకాష్నే హీరోయిన్గా తీసుకోవాలనుకున్నాం. ఆమె అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదనిపించింది. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రల్లో ఉత్తమమైనదిగా నిలిచిపోతుంది. అమ్మాయి దృష్టికోణంలో నడిచే ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. కథ గురించి ఎక్కువగా చెప్పాలనుకోవడం లేదు. తెరపై చూస్తేనే ఆ భావోద్వేగాల్ని ఫీల్ అవుతారు. ప్రధాన తారాగణమంతా అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ ప్రేమకథకు సంగీతం ప్రాణంగా నిలిచింది. ఈ చిత్రాన్ని బెంగళూరు, చెన్నైలో కూడా విడుదల చేస్తున్నాం. నా తదుపరి సినిమాకు కథలు సిద్ధం చేసుకుంటున్నా. ఆ వివరాల్ని త్వరలో వెల్లడిస్తా’ అన్నారు.