ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలతో భారీ విజయాల్ని సొంతం చేసుకుంది చెన్నై సోయగం శృతిహాసన్. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచుగా అభిమానులతో సంభాషిస్తుంటుందీ భామ. తాజాగా ట్విట్టర్లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలు తనదైన శైలిలో సమాధానమిచ్చింది. సంగీతమంటే తనకు ప్రాణమని, నటనతో సమానంగా మ్యూజిక్ను ఇష్టపడతానని పేర్కొంది.
మంచు ప్రదేశాల్లో నాయికలు చీర ధరించి నృత్యాలు చేయడం చాలా అసౌకర్యంగా ఉంటుందని కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్ పేర్కొంది. ఇదే విషయం గురించి అభిమాని ఓ ప్రశ్న అడగ్గా.. ‘మైనస్ ఉష్ణోగ్రతల్లో చీర కట్టుకొని డ్యాన్స్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే కొన్ని పాటలకు చీరలే బాగా సూటవుతాయి. అలాంటప్పుడు ఆ కష్టాన్ని భరించాల్సిందే. ప్రేక్షకులు కూడా ఆ తరహా గీతాలను చూడటానికి ఎంతో ఇష్టపడుతుంటారు. వారికోసమైనా బాధను ఓర్చుకోవాల్సిందే’ అని చెప్పింది.