Bala Krishna |సినిమా రంగం అంటే గ్లామర్, భారీ బడ్జెట్లు, కోట్లలో పారితోషికాలు గుర్తుకొస్తాయి. ఒక సినిమా హిట్ అయితే చాలు.. హీరోల రెమ్యునరేషన్లు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా ముందే కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం పూర్తి మొత్తాన్ని తీసుకోవడం ఈ రోజుల్లో సాధారణం. అయితే ఈ ట్రెండ్కు పూర్తి విరుద్ధంగా నిలుస్తూ, నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచించే హీరోగా మరోసారి నందమూరి బాలకృష్ణ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న బాలయ్య ‘అఖండ’ నుంచి మొదలైన విజయపరంపరతో వరుస హిట్లను అందుకున్నారు. దీంతో ఆయన డిమాండ్, మార్కెట్ రెండూ భారీగా పెరిగాయి.
నిర్మాతలు ఆయన అడిగినంత పారితోషికం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే గతేడాది డిసెంబర్లో విడుదలైన ‘అఖండ-2’ విషయంలో మాత్రం లెక్కలు కొంత మారాయి. దాదాపు రూ.120-125 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించినప్పటికీ, భారీ ఖర్చుల కారణంగా నిర్మాతలకు ఆశించిన లాభాలు అందించలేకపోయింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బాలయ్య తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ‘అఖండ-2’ కోసం దాదాపు రూ.40 కోట్ల పారితోషికం తీసుకున్న ఆయన, ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న (NBK 111) చిత్రానికి తన రెమ్యునరేషన్ను గణనీయంగా తగ్గించుకున్నట్లు సమాచారం.
దాదాపు రూ.10 కోట్ల వరకు తగ్గించుకుని రూ.30 కోట్లకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. నిర్మాతపై భారం పడకూడదనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా హీరోలు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తమ పారితోషికాన్ని తీసుకుంటారు. కానీ బాలయ్య మాత్రం సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత నష్టపోకూడదనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారు. ఇదే కారణంగా ఆయనపై ట్రేడ్ వర్గాలు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వార్త బయటకు రాగానే అభిమానులు ‘మా బాలయ్య బంగారం’ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి.