Lost Ladies | కిరణ్ రావు దర్శకత్వంలో అమీర్ఖాన్ నిర్మించిన ‘లాపతా లేడీస్’ చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. మహిళా సాధికారత, స్వేచ్ఛ ప్రధానాంశాలుగా ఉత్తర భారత గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకొంది. 2025 ఆస్కార్ బరిలో భారత్ తరపున అధికారిక చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్ను దక్కించుకునేందుకు అమీర్ఖాన్, కిరణ్రావు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఆస్కార్ ప్రచారం కోసం ఈ సినిమా టైటిల్ను ‘లాస్ట్ లేడీస్’గా మార్చుతున్నట్లు చిత్ర బృందం సోషల్మీడియా వేదికగా ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో టైటిల్కు రీచ్ వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నామని, హిందీ అర్థాన్ని స్ఫురించేలా ఇంగ్లీష్లో ‘లాస్ట్ లేడీస్’ అనే టైటిల్ పెట్టామని అమీర్ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ను విడుదల చేశారు. మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో నితాన్షి గోయల్, ప్రతిభా రాంటా, స్పర్శ్ శ్రీవాస్తవ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషించారు.