ముంబై : భారత్లో తొలి రూఫ్టాప్ డ్రైవ్ ఇన్ మొబైల్ ధియేటర్ శుక్రవారం ముంబైలో ప్రారంభమైంది. రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో ఈ డ్రైవ్ ఇన్ ధియేటర్ను పీవీఆర్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్లు నటించిన సూర్యవంశి జియో డ్రైవ్ ఇన్ ధియేటర్లో తొలి చిత్రంగా ప్రదర్శించబడుతుంది. 290 వాహనాల వరకూ ఈ డ్రైవ్ ఇన్ ధియేటర్లోకి వచ్చే వెసులుబాటు ఉంది.
కరోనా మహమ్మారితో ఇంటికే పరిమితమైన వారికి అత్యంత భద్రతతో కూడిన ఓపెన్ స్పేస్లో బిగ్ స్ర్కీన్పై మూవీని వీక్షించే వెసులుబాటు డ్రైవ్ ఇన్ ధియేటర్తో అందుబాటులోకి వచ్చిందని జియో వరల్డ్ డ్రైవ్ సీఈఓ దర్శన్ మెహతా పేర్కొన్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో 17.5 ఎకరాల్లో ఇటీవల లాంఛ్ చేసిన జియో వరల్డ్ డ్రైవ్లో ఈ డ్రైవ్ ఇన్ ధియేటర్ను ఏర్పాటు చేశారు.
ఈ ధియేటర్లో మూవీ చూడాలనుకునే ప్రేక్షకులు బుక్మైషోతో పాటు పీవీఆర్ యాప్లోనూ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సినిమాలను ఇప్పుడు ఎక్కడనుంచైనా చూడవచ్చని, సినిమా మరింత ప్రయోగాత్మకంగా మారిందని పీవీఆర్ లిమిటెడ్ సీఎండీ అజయ్ బిజ్లి తెలిపారు. నగరం నడిబొడ్డున డ్రైవ్ ఇన్ ధియేటర్ల కాన్సెప్ట్ ఇదే మొదటిసారని ఇది వినూత్న అవకాశమని చెప్పుకొచ్చారు.