Oscar awards | ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ద్వారా భారతీయ ఆస్కార్ కల సాకారమైంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాట తొలిసారి దేశం తరపున ఆస్కార్ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆస్కార్ -2024 అధికారిక ఎంట్రీ చిత్రాల ఎంపిక కోసం ప్రక్రియ మొదలైంది. ప్రముఖ దర్శకుడు గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన కమిటీ చెన్నై కేంద్రంగా ఆస్కార్ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను పరిశీలిస్తున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 22 చిత్రాలు అధికారిక ఎంట్రీలో చోటుదక్కించుకున్నాయని తెలిసింది.
ఇందులో తెలుగు నుంచి దసరా, బలగం చిత్రాలు ఉన్నట్లు సమాచారం. భారత్ అధికారిక ఎంట్రీ కోసం హిందీ నుంచి ది స్టోరీ టెల్లర్, మ్యూజిక్ స్కూల్ , మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే , ట్వివెల్త్ ఫెయిల్, ఘూమర్, గదర్-2, రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని, జ్విగాటో, ది కేరళ స్టోరీ చిత్రాలు ఉన్నాయని చెబుతున్నారు. తమిళం నుంచి విడుదలై-1 సినిమా పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాల్లో ఒకదానికి ఎంపిక చేసి భారత్ తరపున ‘ఉత్తమ విదేశీ చిత్రం’ కేటగిరీలో ఆస్కార్కు పంపించనున్నారు.
భారత్ నుంచి ఆస్కార్ ఎంట్రీ కోసం పరిశీలిస్తున్న దసరా, బలగం చిత్రాలు రెండూ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కినవి కావడం విశేషం. కుటుంబ అనుబంధాల ఔన్నత్యాన్ని, తెలంగాణ గ్రామీణ జీవన సౌందర్యాన్ని వెండితెర దృశ్యమానం చేసిన ‘బలగం’ సినిమా ఆస్కార్ ఎంట్రీకి అర్హత సాధించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.