సినీరంగంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదని.. ప్రతి రోజును సవాలుగా తీసుకోవాలని చెప్పింది అగ్ర కథానాయిక తాప్సీ. నిన్నటికంటే ఈ రోజు ఎంతటి పరిణితి సాధించామన్నదే భవిష్యత్తును నిర్దేశిస్తుందని అభిప్రాయపడింది. వరుసగా మహిళా ప్రధాన కథల్ని ఎంచుకోవడం వల్ల బోర్గా ఫీలవడం లేదని, పాత్రల్లో వైవిధ్యమే నటీనటులకు దీర్ఘకాలంలో పేరుని తెచ్చిపెడుతుందని పేర్కొంది. గత ఏడాదికాలంగా లాక్డౌన్ ఆంక్షల నడుమ కూడా తాను నాలుగు సినిమా షూటింగ్స్ను పూర్తిచేశానని.. కాలంతో పరుగుతీయక పోతే రేసులో వెనకబడతామని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘లాక్డౌన్ వల్ల ఒత్తిడిగా ఫీలైనా పని నుంచి మాత్రం తప్పుకోలేదు. వరుసగా సినిమాలు పూర్తిచేశాను. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా కమర్షియల్ చిత్రాలు చేయడం వల్ల ఏమాత్రం గుర్తింపు పొందలేకపోయా. గత ఐదేళ్లుగా నా మనసుకు నచ్చిన కథలు ఎంచుకుంటున్నా. నటిగా నన్ను నేను భిన్న కోణాల్లో ఆవిష్కరించుకునే అవకాశం దక్కుతున్నది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నేను కోరుకున్న విధంగా కెరీర్లో స్థిరపడ్డాననే సంతృప్తి కలుగుతున్నది’ అని తాప్సీ తెలిపింది. ప్రస్తుతం తాను డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని, కెరీర్ ముగిసే లోపు మరికొన్ని ఉత్తమ కథా చిత్రాల్లో నటించాలన్నదే తన సంకల్పమని తాప్సీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ భామ దొబారా, శభాష్ మిత్తు, బ్లర్, మిషన్ ఇంపాజిబుల్ (తెలుగు) చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.