నగరం.. స్వరాల ఊయలలో ఓలలాడింది.. సరిగమల తరంగం వీనుల విందు చేసింది. ‘ఆమనీ పాడవే హాయిగా’.. అంటూ సాగింది. వసంతమే ఉషస్సులా జ్వలించింది. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రాత్రి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత కచేరీ ప్రేక్షకుల మనసు మైమరిచిపోయేలా చేసింది.
తెలుగు పాటను తేనెలో ముంచి శ్రోతలకు అందించడంలో మ్యాస్ట్రో ఇళయరాజాను మించిన వారెవ్వరూ లేరు. తన మధురమైన పాటలను ఇప్పటికీ అందరూ ఆస్వాదిస్తూనే ఉంటారు. అటువంటి పాటలను ఆయనే స్వయంగా ఆలపించి నగరవాసులకు అద్భుత అనుభూతిని పంచారు. గచ్చిబౌలి స్టేడియంలో సంగీత దర్శకుడు ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ ఆదివారం ఘనంగా జరిగింది.
హైదరాబాద్ టాకీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంగీత కచేరికి సుమారు 20 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. వేదికపై వంద మంది కళాకారుల మధ్య ఇళయరాజా పాటలు పాడుతుంటే ఎస్పీ చరణ్, శ్వేతా మీనన్, గాయని సునీత కోరస్లు ఇస్తూ సంగీత ప్రియులను మైమరిపింపజేశారు. ఇళయరాజా నోట వినిపించిన ప్రతి పాటకు ప్రేక్షకులు కరతాల ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్, హీరో, దర్శకుడు తరుణ్ భాస్కర్, మంచు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సంగీత దర్శకుడు జీకే వెంకటేశ్ దగ్గర సహాయకుడిగా కొంతకాలం పనిచేసిన ఇళయరాజా 1976లో అన్నక్కలి అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. అప్పటి వరకు ఉన్న సంగీత దర్శకులకు పూర్తి భిన్నంగా తన బాణీలను నడిపించి అనతికాలంలోనే ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి. సాహిత్యంలోని భావ సౌందర్యం చెడకుండా.. ఆ పదాలు సంగీత హోరులో కలిసిపోకుండా బాణీ కట్టడం ఆయనకే సొంతం.
సంప్రదాయబద్ధమైన సంగీతానికి పాశ్చాత్య సంగీతాన్ని జోడిస్తూ చేసిన అనేక ప్రయోగాలు ఇళయరాజాను మరో మెట్టెక్కించాయి. వివిధ భాషల్లో సుమారు 5వేలకు పైగా పాటలకు, వెయ్యికి పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా ఆయన పనిచేశారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లో గొప్ప పేరు తెచ్చుకున్నారు.ఆయన ప్రతిభకు పద్మభూషణ్, పద్మ విభూషన్ పురస్కారాలు వరించిన విషయం తెలిసిందే.