హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లోనూ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మరింత అప్రమత్తత అవసరమని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో రైతులు వస్తుండటంతో కరోనా సోకే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే సివిల్ సైైప్లె అధికారులు, రైతులు పలువురు కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. వాస్తవానికి కరోనా విజృంభిస్తుండటంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే సమయంలోనే కరోనా నిబందనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ అక్కడక్కడ కేసులు నమోదవుతూనే ఉండడం గమనార్హం.
కరోనా సోకినప్పటికీ కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదు.. కొంతమంది రైతులకు జ్వరం ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నారు. అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతులంతా కలిసి వానలో తడుస్తూనే ధాన్యం కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో వైరస్ వ్యాప్తిచేందే అవకాశం ఎక్కువగా ఉంటున్నది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో 43 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.