Tollywood | కథానాయిక’.. ఈ స్థానానికి ఇప్పుడు విలువ ఉందా? ప్రస్తుత సినిమాల్లో హీరోల పక్కన కనిపిస్తూ, వాళ్లను ప్రేమిస్తూ.. కవ్విస్తూ.. కలిసి స్టెప్పులేస్తూ.. మధ్యమధ్యలో తళుక్కున మెరిసి మాయమవుతున్న అందాలను.. అలవాటులో పొరపాటుగా హీరోయిన్స్ అనేస్తున్నాం గానీ.. నిజానికి అలా పిలిపించుకునే స్థాయి.. అనిపించుకునే అర్హత ఈ పాత్రలకు ఉన్నాయా? ప్రస్తుతం వెండితెర కథానాయిక అంపశయ్య మీద ఉన్నది. కొడిగట్టిన దీపంలా నేడో రేపో కొండెక్కటానికి సిద్ధంగా ఉన్నది. దేనికీ పరిస్థితి?. ఎవరిదీ పాపం?
‘పాతాళ భైరవి’ సినిమాలో నేపాల మాంత్రికుడైన ఎస్వీయార్ అంటాడు.. ‘జనం మెచ్చింది మనం శాయవలెనా.. మనం చేసింది జనం చూడవలెనా..’ అని. ‘జనం మెచ్చిందే మనం చేయాలి దేవరా..’ అంటాడు సదాజపుడిగా ఉన్న పద్మనాభం. నేటి సినీ పరిశ్రమకు వేదం లాంటి డైలాగ్ ఇది. సినిమా వ్యాపార మాధ్యమం కనుక కచ్చితంగా జనం మెచ్చిందే చెయ్యాలి.. తప్పులేదు.. తప్పదు. కానీ, ఈ ప్రక్రియ వల్ల తెరపై విలువలు, వలువలు రెండూ మాయమయ్యాయి. కథానాయిక అయితే అనారోగ్యానికి గురైంది.. ఇది నిజం.
‘పాతాళ భైరవి’ సినిమాతో పుట్టిన ‘హీరోయిజం’ అనే వైరస్.. సినీ పరిశ్రమమొత్తం వ్యాపించి కథల్ని ప్రభావితం చేసింది. అది కొన్నేళ్లపాటు నివురుగప్పిన నిప్పులా ఉండి, ‘అడవి రాముడు’తో దావానలంగా మారింది. ఇక సినిమాకు హీరోనే సర్వాంతర్యామిగా మారాడు. దర్శకనిర్మాతలకు హీరోల భజనలు, బిల్డప్పులే తారక మంత్రాలయ్యాయి. ‘ట్రెండ్’ అనే బూచికి రచయితలు కూడా వత్తాసు పలికారు. ఫలితం మంచి కథలు మరుగున పడ్డాయి. కథానాయిక మంచం పట్టింది. తాము మెచ్చింది జనానికి నచ్చేలా చూపించేంత ప్రతిభావంతులైన దర్శకులు కనుమరుగవ్వడం కూడా ఈ పరిస్థితికి కారణం అని చెప్పొచ్చు. బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఎల్వీ ప్రసాద్, కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, కె.విశ్వనాథ్, కె.బాలచందర్, బాపు.. వీరంతా ట్రెండ్ని సెట్ చేశారు తప్ప అనుసరించలేదు. అందుకే వారి నుంచి అద్భుతాలు, ఆణిముత్యాలు వచ్చాయి. హీరోలతో సమానంగా హీరోయిన్లు కూడా ఓ వెలుగు వెలిగారు. ఆ ప్రభను కాసేపు గుర్తుచేసుకుందాం.
ఫలానా హీరో సరసన ఫలానా హీరోయిన్ నటించిందని మాట్లాడుకోవడం, రాయడం పరిపాటే. అయితే.. ఆత్మాభిమానానికి, అభిజాత్యానికి ప్రతికగా నిలిచిన మహానటి, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ నటించిన చండీరాణి, విప్రనారాయణ, చింతామణి, చక్రపాణి.. ఇలా ఎన్నో చిత్రాల్లో ఆమె సరసన ఎన్టీయార్, ఏఎన్నార్ నటించారంటే కాదనగలమా?!.
స్వప్నసుందరి, సువర్ణసుందరి, చెంచులక్ష్మి, ఇలవేల్పు.. ఇవన్నీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే. మరి వీటన్నిటిలో అంజలిదేవి సరసన అక్కినేని నటించారంటే తప్పేంకాదే! మహానటి సావిత్రి నటించిన సిరిసంపదలు, దేవత, సుమంగళి, చదువుకున్న అమ్మాయిలు, ఆరాధన, మాతృదేవత.. ఈ సినిమాలన్నీ స్త్రీ ప్రాధాన్య చిత్రాలే కదా! వీటిల్లో సావిత్రికి జోడీగా ఎన్టీయార్, ఏఎన్నార్ నటించారు.. ఔనా కాదా?
ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ ‘తోడికోడళు’్ల సినిమాలో అక్కినేని ఓ పాత్రధారి మాత్రమే. కన్నాంబ, సూర్యకాంతం, సావిత్రి ఇందులో ప్రధాన పాత్రధారులు. అయినా ఆ సినిమాకు అప్పటి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తమిళనాట ‘యంగళ్వీట్టు మహలక్ష్మి’ పేరుతో విడుదలై అక్కడ కూడా ఘన విజయాన్ని అందుకుందీ సినిమా. అప్పటి ప్రేక్షకులు హీరోయిన్లకు ఇచ్చిన విలువ అదీ.
1950లో విజయావారు ‘షావుకారు’ అనే సినిమా తీశారు. ఆ సినిమా టైటిల్ రోల్ చేసింది గోవిందరాజుల సుబ్బారావు. అప్పటికే ఆయన పెద్ద స్టార్. అందులో యువజంటగా ఎన్టీయార్, షావుకారు జానకి నటించారు. జానకికి అదే తొలి సినిమాకాగా, ఎన్టీయార్కు సోలో హీరోగా తొలి సినిమా. అప్పటివరకూ రెండుమూడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఎస్వీ రంగారావు, ‘షావుకారు’లో సున్నపు రంగడిగా ప్రాధాన్యమున్న పాత్ర చేశారు. ఇప్పుడు ఇదంతా దేనికి? అంటే.. చందమామ కథల పుస్తకం కూడా విజయావారిదే కావడం చేత, అప్పట్లో ‘షావుకారు’ సినిమా ప్రకటనను ఆ పుస్తకం వెనుక భాగంలో ముద్రించారు. ఆ ప్రకటనలో గోవిందరాజుల సుబ్బారావుగానీ, ఎన్టీయార్గానీ కనిపించరు. ఒక్క షావుకారు జానకి మాత్రమే ఉంటారు. అది ఆమె తొలి సినిమా అయినా.. అప్పటి తరంవాళ్లు కథానాయికకు ఇచ్చిన విలువ అది. అందుకు తగ్గట్టే తర్వాత కాలంలో ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకొని, శంకరమంచి జానకి కాస్తా.. ‘షావుకారు’ జానకిగా మారిపోయారు.
ఐకానిక్ క్యారెక్టర్లతో భారతీయ సినీచరిత్రలో ఏ హీరోయిన్లూ సాధించలేని క్రెడిట్ను సాధించారు మన నాయికలు. వెండితెర సీతమ్మ అంటే.. అంజలీదేవే గుర్తొస్తారు. ద్రౌపది అంటే కళ్లముందు కదిలే రూపం.. మహానటి సావిత్రి. సత్యభామ అనగానే తళక్కున మెరిసే రూపం.. జమున, ఆదిపరాశక్తిగా కేఆర్ విజయ రూపాన్ని మర్చిపోగలమా!.. సాంఘిక పాత్రలే కాదు, పౌరాణిక పాత్రలతోనూ ఓ బెంచ్ మార్క్ను సెట్ చేశారు మన హీరోయిన్లు. జయలలిత, వాణిశ్రీ, శారద, జయసుధ, శ్రీదేవి, జయప్రద, రాధిక, విజయశాంతి, సౌందర్య.. ఓ విధంగా స్వర్ణయుగాన్ని చవిచూసిన కథానాయికలు వీరు.
వీరిలో శ్రీదేవి మినహా ఎవరూ ‘పద్మశ్రీ’లు కారు. సావిత్రి బయోపిక్లో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేశ్ జాతీయ ఉత్తమనటి అయ్యారు కానీ, సావిత్రి మాత్రం ఇప్పటివరకూ ‘పద్మశ్రీ’ కాలేకపోయారు. భావదారిద్య్రానికి పరాకాష్ట ఇది. కానీ, జనం సావిత్రికి ఇచ్చిన బిరుదు.. ‘మహానటి’. అప్పటి కథానాయిక పరిస్థితి అలా ఉంటే.. నేటి కథానాయిక పరిస్థితి అధ్వాన్నం. అప్పుడప్పుడే
‘అరుంధతి’, ‘ఓ బేబీ’, ‘గీత గోవిందం’ లాంటి మెరుపులు. మిగతా అంతా గ్లామర్ షోలే. ఇప్పుడు కథానాయిక అంటే.. హీరోల పక్కన తైతక్కలాడే ఆటబొమ్మ. సరైన కథలు తీసే దర్శకులు, రాసే రచయితలు, అభిరుచి గల నిర్మాతలు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం.
సమాజంలో కోటానుకోట్ల జీవితాలు. ఆ జీవితాల నుంచే కథలు పుడతాయి. ఆ కథల నుంచే మంచి పాత్రలు ఉత్పన్నమవుతాయి. ఉదాహరణగా మహాభారతాన్ని తీసుకుంటే.. అది ఓ సమాజం. ఇందులో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. ఎవరి కథకు వాళ్లు హీరో. ప్రతి కథలో హీరోయిన్ కామన్. అన్ని కథలూ ఏదోఒక నీతిని చెబుతాయి. అందుకే అది పంచమవేదం అయ్యింది. రచయితలకు అంతకు మించిన రిఫరెన్స్ మరొకటి ఉండదు. కానీ, రొడ్డకొట్టుడు కథలే వాళ్లు రాస్తారు.. వీళ్లు తీస్తారు.
చివరిగా చెప్పొచ్చేదేంటంటే.. ఒకప్పుడు హీరోహీరోయిన్లు సమానం.. కొన్నాళ్ల తర్వాత హీరో కాస్త ఎక్కువ సమానం.. ఇప్పుడు హీరోనే సర్వాంతర్యామి.. మరి హీరోయిన్కు మంచిరోజులెప్పుడో?! కథానాయిక.. సినిమా ఏలిక అయ్యేదెన్నడో?!
– బుర్రా నరసింహ