‘మా కుటుంబానికి ఎలాంటి సినీ నేపథ్యం లేదు. అయితే చిన్నప్పటి నుంచి కళలకు సంబంధించిన ప్రతీ విషయంలో ప్రోత్సహించేవారు. దాంతో స్కూల్ రోజుల్లోనే భరతనాట్యం, క్లాసికల్ సింగింగ్ నేర్చుకున్నా. 2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ టైటిల్ గెలిచాను. అక్కడి నుంచి గ్లామర్ ప్రపంచంలో నా ప్రయాణం మొదలైంది’ అని చెప్పింది గాయత్రి భరద్వాజ్. ఆమె రవితేజ సరసన కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గాయత్రీ భరద్వాజ్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ సినిమాలో నా పాత్ర గురించి చెప్పినప్పుడు కన్నీళ్లొచ్చాయి. అంత ఎమోషనల్గా ఉంటుంది.
ఇందులో నేను మణి అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపిస్తాను. నా క్యారెక్టర్ రస్టిక్గా ఉంటుంది. కాస్త మగరాయుడి తరహాలో డేరింగ్ నేచర్తో కనిపిస్తాను. 70దశకంలో జరిగే కథ ఇది. అందుకే నా పాత్ర విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా. తెలుగు కోచ్ సహాయంతో ప్రతి డైలాగ్ అర్థాన్ని తెలుసుకొని నటించాను. ఇప్పుడు తెలుగు చాలా వరకు అర్థమవుతుంది. ఈ కథలో ఆసక్తికరమైన మలుపులు ఉంటాయి. ఇందిరాగాంధీ ఎపిసోడ్ కూడా ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. తెలుగు ఇండస్ట్రీ చాలా బాగుంది. ఇక్కడి ప్రేక్షకుల ప్రేమ చాలా ప్రత్యేకం. తెలుగులో నా ఫేవరేట్ హీరో రామ్చరణ్. తెలుగులో మరో ప్రాజెక్ట్ ఓకే చేశాను. ఆ వివరాల్ని చిత్ర నిర్మాతలు వెల్లడిస్తారు’ అని చెప్పింది.