Rajpal Yadav | నటుడు రాజ్పాల్ యాదవ్ తన జైలు శిక్షకు సంబంధించిన వివాదంపై స్పందిస్తూ, ఈ వ్యవహారాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. సుమారు 9 కోట్ల రూపాయల లోన్ ఎగవేత మరియు చెక్ బౌన్స్ కేసులో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులపై తాజాగా ఒక పాడ్కాస్ట్లో క్లారిటీ ఇచ్చారు. తాను కేవలం డబ్బులు చెల్లించలేక జైలుకు వెళ్ళలేదని ఇది తన సిద్ధాంతాలకు సంబంధించిన విషయమని తెలిపాడు.
ఈ వివాదం కేవలం 5 కోట్ల రూపాయలకే పరిమితమై ఉంటే 2012లోనే పరిష్కారమయ్యేదని, కానీ ఈ గొడవ వల్ల తాను దాదాపు 17 కోట్ల రూపాయలను నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన సినిమా ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే 12 కోట్లు ఖర్చు చేశానని, అది మొత్తం 22 కోట్ల ప్రాజెక్ట్గా మారిందని వెల్లడించారు. శత్రువులైనా సరే సినిమా విడుదలకు అడ్డుపడకూడదని, తుది తీర్పును ప్రేక్షకులకే వదిలేయాలని ఆయన అన్నారు. మరోవైపు తనపై వచ్చిన మోసం ఆరోపణలను రాజ్పాల్ యాదవ్ ఖండించారు. సినిమా రంగంలో వ్యాపారం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమని, అనేక సినిమాలు వాణిజ్యపరంగా విఫలమవుతుంటాయని, అలా సినిమా ఆడకపోవడాన్ని తప్పుగా లేదా మోసంగా భావించకూడదని ఆయన వాదించారు. ప్రస్తుతం న్యాయపోరాటం కొనసాగుతున్నప్పటికీ, తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, ఈ సమస్యను తాను సృష్టించకపోయినప్పటికీ దీనిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సినిమాల విషయానికి వస్తే.. రాజ్పాల్ ఇటీవల అక్షయ్ కుమార్ నటించిన భూత్ బంగ్లా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.