దేశీయ సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్గా మారిన నేపథ్యంలో నగరానికి పలువురు బాలీవుడ్ తారల రాకపోకలు పెరిగాయి. తమ షూటింగ్ల నిమిత్తం తరుచూ వారు ఇక్కడికి వస్తున్నారు. తాజాగా నాయిక కియారా అద్వానీ సిటీలో అడుగుపెట్టింది. ఆమె రామ్చరణ్ సరసన ఆర్సీ 15 అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది.
ఇందులో పాల్గొనేందుకు కియారా భాగ్యనగరం చేరుకుంది. ఆస్కార్ అవార్డుల వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన రామ్చరణ్ కూడా నగరానికి చేరుకున్నారు. తాజా షెడ్యూల్లో రామ్చరణ్, కియారా మీద డ్యూయెట్ను చిత్రీకరించనున్నారు. దర్శకుడు శంకర్ చిత్రాల్లో పాటలకు ఉండే ప్రత్యేకత ప్రేక్షకులకు తెలుసు. అదే స్థాయిలో కలర్ఫుల్గా ఈ పాటను రూపకల్పన చేయబోతున్నారని సమాచారం. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నది. ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో శ్రీకాంత్, అంజలి, సునీల్, ఎస్జే సూర్య, జయరామ్, నవీన్ చంద్ర నటిస్తున్నారు.