‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’ ‘మహారాణి’ వంటి చిత్రాలతో బాలీవుడ్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హ్యూమా ఖురేషి. ఇటీవల ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన సాహిత్య సదస్సులో పాల్గొన్న ఆమె ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. హాలీవుడ్లో తన అరంగేట్రం చిత్రం ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’ దర్శకుడు జాక్ సిండర్కు భగవద్గీతను బహుమతిగా అందించానని వెల్లడించింది. ‘దర్శకుడు జాక్కు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే చాలా ఇష్టం.
మహాభారతం గురించి లోతుగా తెలుసుకోవాలనే కోరిక ఉండేది. షూటింగ్ సందర్భంగా ఘనమైన భారతీయ వారసత్వం గురించి ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్లం. ‘ఆర్మీ ఆఫ్ డెడ్’ చిత్రాన్ని కూడా మహాభారత స్ఫూర్తితో తెరకెక్కించారు. అందుకే షూటింగ్ పూర్తయిన రోజునే ఆయనకు భగవద్గీతను బహుమతిగా అందించా’ అని హ్యూమా ఖురేషి చెప్పింది. ‘ఆర్మీ ఆఫ్ డెడ్’ చిత్రం రెండేళ్ల క్రితం విడుదలైంది. జాంబీ జోనర్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.