హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు బుధవారం అత్యంత నిరాడంబరంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ని బంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ అవతరణ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ సహా పలువురు నేతలు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయజెండాను ఆవిష్కరించారు. అంతకుముందు గన్పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అమరుల స్మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. సీఎం కేసీఆర్తోపాటు శాసనసభ మాజీస్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ సంతోష్కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లతాశోభన్రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించారు. అక్కడినుంచి నేరుగా ప్రగతిభవన్కు వెళ్లిన సీఎం కేసీఆర్.. పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ఎంపీలు సంతోష్కుమార్, రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు: రాష్ట్రపతి
తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఉజ్వల భవిష్యత్ ఉండాలని కోరుకొంటున్నానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇంటింటికీ తాగునీరు ఇచ్చే జాతీయలక్ష్యాన్ని తెలంగాణ సాధించిందని రాష్ట్రపతి ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు.
ఘనచరిత్ర, విశిష్ట సంస్కృతులకు నిలయం : ఉపరాష్ట్రపతి
తెలంగాణ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు తెలంగాణ నిలయమన్నారు. సహజవనరులతో, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయ సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి ట్విట్టర్లో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు కష్ట జీవులు: ప్రధాని
తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాల కలబోత తెలంగాణ అని అన్నారు. రాష్ట్రప్రజలు కష్టజీవులని పేర్కొన్నా రు. తెలంగాణ ప్రజలు అనేక ప్రాం తాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారని కొనియాడారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ప్రధాని ట్విట్ట ర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
దేశ పురోగతికి గణనీయమైన కృషి : కేంద్ర హోం మంత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాష్ట అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టించి పనిచేసే త త్వం గల తెలంగాణ ప్రజలు దేశ పురోగతికి గణనీయమైన కృషి చేస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ ప్రజలందరి శ్రేయస్సు కోసం ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అమిత్ షా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
మరింత అభివృద్ధి సాధించాలి: రాష్ట్ర గవర్నర్
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని, ఇంకా అనేక విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నానని గవర్నర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మండలిలో చైర్మన్ గుత్తా.. శాసనసభలో స్పీకర్ పోచారం
రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేశారు. జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో అహింసా మార్గంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన మహానాయకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు, టీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.