Hombale Films | పాపులర్ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) ధూమం సినిమాతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ రేపు థియేటర్లలో సందడి చేయనుంది. కాగా ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
హోంబలే ఫిలిమ్స్ తొలిసారి స్ట్రెయిట్ తెలుగు సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయింది. అంతేకాదు కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఈ చిత్రానికి స్క్రీన్ రైటర్గా పనిచేయబోతున్నాడట. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, అనుభవించు రాజా ఫేం శ్రీనివాస్ గవిరెడ్డితో కలిసి ఈ తెలుగు సినిమాను తెరకెక్కిస్తోంది హోంబలే ఫిలిమ్స్. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సినిమా ఉండబోతుందని ఇన్సైడ్ టాక్.
ఈ ప్రాజెక్ట్లో ఆదర్శ్ బాలకృష్ణ (Adarsh Balakrishna) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం అన్ని భారతీయ భాషల్లో విడుదల కానుందని సమాచారం. మరిన్ని వివరాలపై మేకర్స్ రాబోయే రోజుల్లో ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.