కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజల్ని, సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. రెండుకోట్ల రూపాయల వ్యయంతో కర్ణాటకలోని మాండ్య ప్రాంతంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్స్, ఇరవై ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేసింది. తెలుగు చిత్రసీమలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న సభ్యులకు 35లక్షల సహాయాన్ని అందించింది. ప్రభాస్ కథానాయకుడిగా హోంబలే ఫిల్మ్స్ రూపొందిస్తున్న ‘సలార్’ చిత్రం కేవలం పదిరోజుల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఆ సినిమా కోసం పనిచేస్తున్న యూనిట్ సభ్యుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదువేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. గత ఏడాది ఈ సంస్థ 350 మంది సినీ కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచింది.