Kangana Ranaut | పరువు నష్టం కేసులో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్కు పంజాబ్ – హర్యానా హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ నెల 14న బటిండా కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపును ఇచ్చింది. సెప్టెంబర్ 8 వరకు కంగనాకు ఊరట కల్పిస్తూ కేసు విచారణను చేపట్టవద్దని దిగువ కోర్టును ఆదేశించింది. గతేడాది కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటిన విషయం తెలిసిందే.
జనవరిలో బటిండాకు చెందిన మొహిందర్ కౌర్ అనే వృద్ధురాలి ఫొటోను షేర్ చేస్తూ కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రూ.100 కూలీ ఇచ్చి రైతుల ఉద్యమంలోకి తీసుకువచ్చినట్లు ట్వీట్ చేసింది. దీంతో మొహింద్ కౌర్ బటిండా కోర్టులో కంగనాపై జనవరి 4, 2021న పరువు నష్టం కేసు వేశారు. ఈ మేరకు కోర్టు ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఇటీవల కంగనా పంజాబ్ – హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ను కొట్టి వేయాలంటూ కోర్టును కోరింది.