‘దర్శకుడు శౌర్యువ్ భవిష్యత్తులో ఎన్ని సినిమాలను డైరెక్ట్ చేసినా.. ‘హాయ్ నాన్న’ మాత్రం అతనికి ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుంది. ఈ సినిమాకు పనిచేసిన అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. మృణాళ్ అద్భుతంగా నటించింది. ఈ సినిమా తర్వాత తనని అందరూ ‘యష్ణ’గా గుర్తుపెట్టుకుంటారు. సాంకేతికంగా నెక్ట్స్ లెవల్ మూవీ ఇది.’ అని హీరో నాని అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘హాయ్ నాన్న’. మృణాళ్ ఠాకూర్ కథానాయిక. బేబీ కియారా కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రానికి దర్శకుడు శౌర్యువ్. నిర్మాతలు మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి. సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఘనంగా ‘హాయ్ నాన్న’ సంగీత విభావరి నిర్వహించింది. భారీగా అభిమానులు పాల్గొన్న ఈ వేడుకలో కమల్హాసన్ ‘గుణ’ సినిమాలోని ‘కమ్మనీ నీ ప్రేమలేఖలే రాసింది హృదయమే’ అని సాగే ఇళయరాజా పాటను నాని ఆలపించి అందర్నీ ఆనందింపజేశాడు. మృణాళ్ఠాకూర్ కూడా ‘హాయ్ నాన్న’ సినిమాలోని ‘ఒడియమ్మా..’పాటకు నర్తించి, అందర్నీ అలరించింది. ఈ సినిమాలో నాని నటనకు అందరూ ప్రేమలో పడిపోతారని, సాంకేతికంగా ఈ సినిమా అద్భుతమని మృణాళ్ఠాకూర్ అన్నారు. ‘హాయ్ నాన్న’ లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయని ప్రియదర్శి చెప్పారు. ఇంకా విరాజ్ అశ్విన్ కూడా మాట్లాడారు.