మలయాళ చిత్రం ‘హృదయం’ ద్వారా దక్షిణాది సంగీత ప్రియుల దృష్టిని ఆకర్షించారు స్వరకర్త హేషమ్ అబ్దుల్ వాహబ్. ప్రస్తుతం ఆయన ‘ఖుషి’ చిత్రానికి బాణీలను సమకూర్చారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలకానుంది. ఈ చిత్ర గీతాలు మ్యూజిక్ ఛార్ట్స్లో అగ్ర భాగాన కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ మాట్లాడుతూ “ఖుషి’ కథ వినగానే ఫీల్గుడ్ లవ్స్టోరీ అనిపించింది. వెంటనే అంగీకరించా. ఈ సినిమాలో ‘నా రోజా నువ్వే’ మొదలుకొని ‘ఓసీ పెళ్లామా’ వరకు అన్ని పాటలకు శ్రోతల ఆదరణ లభిస్తున్నది.
ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ నెల రోజుల పాటు నిర్వహించాం. అందుకే పాటలు అద్భుతంగా కుదిరాయి. ‘నా రోజా నువ్వే’ పాటలో మణిరత్నం సినిమా టైటిల్స్తో లిరిక్స్ ఉంటాయి. ఈ పాట థీమ్ బాగా వర్కవుట్ అయింది. దర్శకుడు శివ నిర్వాణకు సంగీతం పట్ల మంచి అవగాహన ఉంది. ఆయన అభిరుచికి తగినట్లుగా పాటలను సిద్ధం చేశాను. మంచి పాటలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవొచ్చు. ఈ విషయాన్ని నేను బాగా నమ్ముతాను. ‘ఖుషి’ సినిమాకు చక్కటి ప్రేమకథతోపాటు పాటలు కూడా బాగా కుదిరాయి. తప్పకుండా సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం నాని ‘హాయ్ నాన్న’ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నా’ అన్నారు.