‘ఏక్ దో తీన్… ఆజా పియా ఆయీ బహార్..’ అని మాధురీ దీక్షిత్ వేసిన స్టెప్పులు నోస్టాలజీ మెమరీ!‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్..’ అని రవీనా చేసిన అల్లరికి యువత అంతా ఫిదా అయింది. ఆనాటి అందాలతారలు కాలంతోపాటు తెర మరుగయ్యారు. వారి పాటలను స్మరిస్తూ తరించే ఓ తరానికి ఓటీటీ మరోఅవకాశం ఇస్తున్నది. నాటి మేటి నాయికలు ప్రధాన తారాగణంగా రూపొందుతున్న వెబ్సిరీస్లు తొంభైల్లోని యువకుల కలలను మరోసారి తట్టిలేపుతున్నాయి. పూర్తిస్థాయిలో కమర్షియల్ పంథాలో సాగుతున్న సినిమాల్లో అవకాశాలు రావని తలచిన వెటరన్ క్వీన్లుఓటీటీకి ఓటు వేస్తున్నారు. వెబ్సిరీస్లలో తమ అభినయాన్ని ప్రదర్శించి నాటి అభిమానులను అలరిస్తూనే నేటి జనరేషన్కూ దగ్గరవుతున్నారు.
బాలీవుడ్లో హీరోలకు దీటుగా అలరించిన నాయికలు ఎందరో ఉన్నారు. ఇప్పుడంటే సింహభాగం సినిమాలు హీరో సెంట్రిక్గా రూపొందుతున్నాయి కానీ, ఒకప్పుడు కథానాయిక పాత్రకూ ఎనలేని ప్రాధాన్యం ఉండేది. హీరో కథే అయినా.. హీరోయిన్ పాత్ర గుర్తుండే విధంగా రూపొందించేవారు దర్శకులు. ముఖ్యంగా 90లలో వచ్చిన సినిమాల్లో నటించిన హీరోయిన్లు బాలీవుడ్ క్వీన్లుగా పేరు తెచ్చుకున్నారు. మాధురీ దీక్షిత్, కాజోల్, రవీనా టాండన్, మనీషా కొయిరాలా, సుస్మితా సేన్ తదితర నాయికలు నటించిన చిత్రాలకు భారీ డిమాండ్ ఉండేది. హీరో ఎవరనేది పక్కన పెట్టి మరీ ఈ తారల సినిమాలకు టికెట్లు తెగేవి.
‘తేజాబ్’, ‘బేటా’, ‘సాజన్’, ‘హమ్ ఆప్కే హై కౌన్’ లాంటి చిత్రాలు మాధురిని టాప్ హీరోయిన్గా నిలబెట్టాయి. రవీనా, మనీషా, కరీనా తదితర నాయికలు సైతం తమ మార్కు నటనతో ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. పెండ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ కావడంతో ఈ హీరోయిన్లు వెండితెరకు దూరమయ్యారు. కొందరు స్క్రీన్ మీద కనిపించి పదిహేనేండ్లు దాటిపోయింది. ఓటీటీ వచ్చాక వీరికి మంచి రోజులు మొదలయ్యాయి. విభిన్న కథాంశాలతో రూపొందుతున్న వెబ్సిరీస్లు వెటరన్ నటీమణులకు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తున్నాయి. కథ భారాన్నంతా భుజానికెత్తుకునే పాత్రలు వీరిని వరిస్తున్నాయి. తమ అనుభవాన్నంతా రంగరించి, అభినయంతో అలరించి మళ్లీ బిజీ అవుతున్నారు.
మాధురీ అదరహో..
మాధురీ 1984 అబోధ్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంటర్ అయింది. మొదట్లో పెద్దగా హిట్లు పలకరించకపోయినా.. తర్వాత వరుస విజయాలతో ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరు సాధించింది. తనంత తాను విరమించే దాకా ఆమె డిమాండ్ కొనసాగింది. ఇండస్ట్రీకి దూరమైనా అడపాదడపా ప్రత్యేక పాత్రల్లో కనిపించింది కూడా! లాంగ్ గ్యాప్ తర్వాత 2022లో నెట్ఫ్లిక్స్లో వచ్చిన ‘ద ఫేమ్ గేమ్’ వెబ్ సిరీస్లో తళుక్కుమన్నది. అందులో హీరోయిన్ పాత్రలో కనిపించిన మాధురీ ఓటీటీలో అరంగేట్రంతోనే విజయాన్ని సాధించింది. అదే ఏడాది ప్రైమ్ వీడియోలో విడుదలైన ‘మజా మా’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. కామెడీ సినిమాలో పక్కా టైమింగ్తో తన అభిమానులకు మరోసారి దగ్గరైంది. ఆమె ప్రధాన పాత్రగా రూపొందుతున్న ‘పంచక్’ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
సుస్మితా వెల్కమ్
1994 విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న సుస్మితా సేన్ నటిగానూ సక్సెస్ సాధించింది. ‘దస్కత్’ చిత్రంతో 1996లో తెర ముందుకు వచ్చిన సుస్మిత ఖాతాలో సూపర్ హిట్లు ఎన్నో ఉన్నాయి. ‘బీవీ నం 1’తో ఇండస్ట్రీని ఊపేసిన ఆమెకు తర్వాత బాక్సాఫీస్ను ఊపేసిన సినిమాలు అంతగా దొరకలేదు. అయితేనేం, తన అందచందాలతో హాట్స్టార్గా పేరు సాధించింది. 2010 తర్వాత ఒకటి, రెండు సినిమాలు మినహా తెరమీద కనిపించలేదామె. 2020లో హాట్స్టార్లో విడుదలైన వెబ్సిరీస్ ‘ఆర్య’తో తన సత్తా చాటింది సుస్మిత. 2021లో సీజన్ 2, గతేడాది వచ్చిన సీజన్ 3 సుస్మిత పాత్ర ప్రధానంగా కొనసాగటం విశేషం. జియో సినిమాలో ఇటీవల విడుదలైన ‘తాలీ’ వెబ్సిరీస్ ఆమెలోని విలక్షణ నటిని మరోసారి పరిచయం చేసింది. ట్రాన్స్జెండర్లకు ప్రతినిధిగా ఆమె నటించిన పాత్ర కొత్తదనంతోపాటు హిట్ను కూడా సొంతం చేసుకుంది.
రావమ్మా రవీనా
అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గణ్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చినప్పుడు వారి సరసన పర్ఫెక్ట్ మ్యాచ్గా రవీనా దూసుకుపోయింది. వరుస హిట్లతో గోల్డెన్ లెగ్ అనిపించుకున్నది. 1991లో ‘పత్తర్ కే ఫూల్’ సినిమాతో తన స్టామినా ఎంటో చూపించింది. 1994లో వచ్చిన ‘మొహ్రా’ సినిమాతో ఆనాటి యంగిస్థాన్ కలలరాణిగా అవతరించింది రవీనా! డిమాండ్ తగ్గకముందే తెలివిగా సినిమాలు తగ్గించి తప్పుకొన్న రవీనా మళ్లీ చాన్నాళ్లకు ఓటీటీలో ఎంట్రీతోనే హిట్ కొట్టింది. 2021లో నెట్ఫ్లిక్స్లో వచ్చిన ‘ఆరణ్యక్’తో మరోసారి ప్రేక్షకులకు దగ్గరైంది. క్రైమ్ థ్రిల్లర్ వెబ్సిరీస్లో పోలీస్ అధికారిణిగా ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు.
కాజోల్.. తగ్గేదే లే..
మాధురి తర్వాత బాలీవుడ్ను శాసించిన నటీమణుల్లో కాజోల్ ఒకరు. ఈ సోగకండ్ల సుందరి ఖాతాలో భారీ విజయాలు కోకొల్లలు. ‘డీడీఎల్జే’తో యావత్ భారతాన్నీ అలరించిన ఆమె నటనలో కొత్త మార్కును ఫిక్స్ చేసింది. అజయ్ దేవగణ్ను పెండ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త దూరం పాటించింది. చాలారోజుల తర్వాత ధనుష్ హీరోగా నటించిన ‘వీఐపీ 2’ సినిమాలో నటించింది. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత ‘ద ట్రయల్’ వెబ్సిరీస్లో నటించింది. హాట్స్టార్లో విడుదలైన ఈ వెబ్సిరీస్లో కార్పొరేట్ లాయర్గా కనిపించింది కాజోల్. కుటుంబ సంఘర్షణ, ఏదో సాధించాలన్న తపన కలగలసిన పాత్రను పర్ఫెక్ట్గా పండించి సీనియారిటీ సత్తా ఏంటో చూపించింది. ఒక్క సిరీస్తో ఓటీటీ దర్శక, నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం వెయిట్ చేసేంతగా పేరు సాధించింది.
వీరేం తక్కువ కాదు
బూరెల్లాంటి బుగ్గలతో అలరించిన జూహీ చావ్లా ఓటీటీలోనూ తన మార్కు చూపుతున్నది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయిన ‘హుష్ హుష్’, నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘ఫ్రైడే నైట్ ప్లాన్’ జూహీ ఖాతాలో ఉన్నాయి. బాలీవుడ్తోపాటు టాలీవుడ్లోనూ మెరుపుతీగ అని పేరు సాధించిన సోనాలి బింద్రే క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత ఓటీటీపై కన్నేసింది. జీ5లో వచ్చిన ‘ద బ్రోకెన్ న్యూస్’లో కీలక పాత్రలో కనిపించింది. మనీషా కొయిరాలా ‘మస్కా’ సినిమాతో ఓటీటీకెక్కగా, ‘మెంటల్హుడ్’ సిరీస్తో కరిష్మా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.