తెలుగు చిత్రసీమ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని చెప్పింది కథానాయిక పాయల్రాజ్పుత్. హిందీలో ధారావాహికలు, మాతృభాష పంజాబీలో సినిమాలు చేసినప్పటికీ టాలీవుడ్ వల్లే తనకు మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయని పేర్కొంది. ప్రస్తుతం తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని..భవిష్యత్తులో తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెబుతానని ధీమా వ్యక్తం చేసింది. ‘కొన్ని సినిమాల పరాజయంతో కథల విషయంలో సెలెక్టివ్గా ఉండాలని నిర్ణయించుకున్నా. ఆలస్యమైనా ఫర్వాలేదు కానీ మంచి కథలకే ప్రాధాన్యతనివ్వాలనుకుంటున్నా. తెలుగు ఇండస్ట్రీ నాకు చక్కటి జీవితాన్నిచ్చింది. ‘ఆర్.ఎక్స్.100’ సినిమా తర్వాత ఇతర భాషల్లో కూడా అవకాశాలు వెల్లువెత్తాయి. టాలీవుడ్ వల్లే విజయం తాలూకు అనుభూతి ఏమిటో తెలుసుకున్నా. అందుకే తెలుగు పరిశ్రమకు ఎప్పుడూ రుణపడి ఉంటా’ అని పాయల్రాజ్పుత్ పేర్కొంది. తెలుగులో ఈ భామ యువహీరో ఆదితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. రెండు సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి.