Vishal | కొత్త సినిమాలు విడుదలైన తొలి మూడురోజుల వరకు థియేటర్లలో పబ్లిక్ రివ్యూలను షూట్ చేయకుండా నిలిపివేయాలని తమిళ హీరో, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ మీడియా ప్రతినిధులతో పాటు థియేటర్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. తమిళ చిత్రం ‘రెడ్ ఫ్లవర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా బతికేందుకు తొలి 12 షోలకు థియేటర్లో ప్రేక్షకుల రివ్యూలను రికార్డ్ చేయకుండా ఆపివేయాల్సిన అవసరాన్ని విశాల్ నొక్కి చెప్పారు.
నడిగర్ సంఘం తరఫున, తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ కతిరేసన్ సమక్షంలో మీడియా, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ను విశాల్ విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకుల అభిప్రాయాలను సేకరించే ముందు కంటెంట్ క్రియేటర్లు సైతం థియేటర్లోనే సినిమా చూడాలని విశాల్ సూచించారు. యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లు సినిమా చూసిన తర్వాత సమీక్షలు చేస్తే.. ఆ తర్వాత ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సినిమా రివ్యూలు అవసరమని చెబుతూనే.. సినిమాలు ఊపిరిపీల్చుకునే అవకాశం పొందాలన్నారు. అయితే, ఇటీవల తొలి మూడురోజుల పాటు ఆన్లైన్లో సినిమాలపై రివ్యూలను నిషేధించాలంటూ తమిల్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు ఇటీవల కొట్టి వేసింది. ఈ క్రమంలో ఇన్స్టంట్ రివ్యూల ప్రభావంపై ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్న సమయంలోనే విశాల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్గా అయ్యాయి.