Sushanth | ‘కథల ఎంపికలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ప్రతీ సినిమాలో వైవిధ్యాన్ని ప్రదర్శించాలన్నదే నా లక్ష్యం’ అన్నారు సుశాంత్. ‘భోళా శంకర్’ చిత్రంలో ఆయన అతిథి పాత్రలో నటిస్తున్నారు. చిరంజీవి కథానాయకుడిగా మోహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం సుశాంత్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
నేను హీరో క్యారెక్టర్స్తో పాటు అతిథి పాత్రల్లో నటిస్తున్నా. ‘అల వైకుంఠపురములో’ ‘రావణాసుర’ చిత్రాల్లో నా గెస్ట్ రోల్స్కు మంచి గుర్తింపు దక్కింది. ఇక ‘భోళా శంకర్’లో చిరంజీవితో కలిసి నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ముఖ్యంగా చిరంజీవి డ్యాన్సుల్ని నేను బాగా ఇష్టపడేవాడిని. దర్శకుడు మోహర్ రమేష్ ఈ సినిమా గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా వెంటనే అంగీకరించా. చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం రావడంతో నా కల నిజమైంది.
గొప్ప జ్ఞాపకాలను మిగిల్చింది
ఈ సినిమాలో చిరంజీవి, కీర్తి సురేష్ అన్నాచెల్లెలు పాత్రల్లో కనిపిస్తారు. ఈ కథ మొత్తం సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా నడుస్తుంది. నా పాత్ర నిడివి తక్కువే అయినా కీలక సన్నివేశాల్లో కనిపిస్తాను. చిరంజీవితో వేసిన స్టెప్పుల కోసం శేఖర్ మాస్టర్ పర్యవేక్షణలో రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేశాను. ఆ సాంగ్ చాలా కలర్ఫుల్గా వచ్చింది. షూటింగ్ సందర్భంగా చిరంజీవి నాతో ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎన్నో మంచి జ్ఞాపకాలను మిగిల్చింది. ప్రస్తుతం నేను హీరోగా రెండు సినిమాలు చేయబోతున్నా. వాటి వివరాలను త్వరలో వెల్లడిస్తా. సినిమాల ఎంపికలో ఎలాంటి నియమాలను పెట్టుకోలేదు. నా మనసుకు నచ్చిన మంచి కథల్లో భాగమవుతూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా.