తెలుగు తెరపై ‘నువ్వొస్తానంటే నేనొద్దంటాన’, ‘బొమ్మరిల్లు’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన కథానాయకుడు సిద్ధార్థ్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ‘టక్కర్’. దివ్యాంశ కౌషిక్ నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కార్తీక్ జి.క్రిష్ దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతున్నది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలు తెలిపారు హీరో సిద్ధార్థ్.
ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణ
ఆసక్తికరమైన కథ ఇది. ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. అది హీరో విలన్ మధ్య కావొచ్చు, హీరో హీరోయిన్ మధ్య కావొచ్చు. డబ్బు, వయసు, ఈగో వంటి అనేక అంశాలు ఈ ఘర్షణకు కారణమవుతుంటాయి. డబ్బు సంపాదించాలనే క్రమంలో హీరో ఒక కిడ్నాపర్గా మారిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. లవ్, యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ వంటి కమర్షియల్ అంశాలన్నీ కలిసిన చిత్రమిదని చెప్పుకోవచ్చు.
కొత్తగా కనిపించాలనే ప్రయత్నిస్తుంటా
తెలుగు ప్రేక్షకులు సినిమాను బాగా ప్రేమిస్తారు. కుటుంబంతో కలిసి థియేటర్స్కు వెళ్తారు. ఇప్పటికీ సిద్ధార్థ్ అంటే తెలుగు ఆడియెన్స్కు ఇష్టం. సిద్ధార్థ్ అంటే పక్కింటి కుర్రాడిలా ఉంటాడని, నాన్నతో సెంటిమెంట్ డైలాగ్స్ చెబుతాడని, లవర్ బాయ్లా కనిపిస్తాడనే ఇమేజ్ ఉంది. ఈ ముద్రతో అలాంటి అవకాశాలే వస్తుండేవి. నాకు అన్ని రకాల పాత్రల్లో నటించాలని, వైవిధ్యంగా తెరపై కనిపించాలని ఉండేది. అలా నా దారి మార్చి యాక్షన్, హారర్, థ్రిల్లర్ వంటి జానర్స్ ఎంచుకుంటున్నాను. ఈ క్రమంలోనే నిర్మాతగా మారాను. నేనొక ప్రేమ కథలో నటించి అది విజయవంతం అయితే మరో పదేండ్ల వరకు అలాంటి కథల్లోనే నటించమని అడుగుతుంటారు. ఆ టైప్ కాస్టింగ్ను బ్రేక్ చేసేందుకే ‘టక్కర్’ లాంటి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాను. తెలుగులో మంచి అవకాశాలు వస్తే తప్పకుండా ఇక్కడ వరుసగా సినిమాలు చేస్తాను.
మరోసారి ‘బొమ్మరిల్లు’ మ్యాజిక్ చేయలేం
‘బొమ్మరిల్లు’ సినిమా నా కెరీర్లో ఎంతో ప్రత్యేకం. అదొక అసాధారణ సినిమా. ఆ కథలోని భావోద్వేగాలను మరోసారి తీసుకురాలేం. అందుకే ‘బొమ్మరిల్లు 2’ అనే ప్రయత్నం చేయడం లేదు. ప్రస్తుతం మా నిర్మాణ సంస్థలోనే ‘గృహం 2’ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే ‘చిన్నా’, ‘ఇండియన్ 2’, మాధవన్, నయనతారతో కలిసి ‘టెస్ట్’ అనే చిత్రంలో నటిస్తున్నా.