కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కథానాయకుడిగా నటిస్తున్న ‘యథా రాజా తథా ప్రజా’ చిత్రం సోమవారం ప్రారంభమైంది. వికాస్ మరో హీరోగా కనిపించనున్నారు. శ్రష్టి వర్మ కథానాయిక. శ్రీనివాస్ విట్టల దర్శకుడు. శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్ నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి శర్వానంద్ క్లాప్నివ్వగా, అయుష్శర్మ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకనిర్మాత శ్రీనివాస్ విట్టల చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సందేశంతో పాటు వాణిజ్య హంగులుంటాయి. సెప్టెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని జానీ మాస్టర్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సునోజ్ వేలాయుధనణ్, సంగీతం: రధన్, నిర్మాణ సంస్థలు: ఓం మూవీ క్రియేషన్స్, శ్రీ కృష్ణ మూవీ క్రియేషన్స్, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: శ్రీనివాస్ విట్టల.