యువ హీరో నిఖిల్ తండ్రయ్యారు. ఆయన సతీమణి డాక్టర్ పల్లవి బుధవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన కుమారుడిని ముద్దాడుతున్న ఫొటోలను షేర్ చేశారు. ‘మా ప్రేమకు గుర్తుగా ఈ చిన్నారిని మా జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నాం.
సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన తరుణమిది’ అంటూ నిఖిల్ సోషల్మీడియాలో పేర్కొన్నారు. నిఖిల్, పల్లవిల వివాహం 2020లో జరిగింది. ‘కార్తికేయ-2’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నారు నిఖిల్. ప్రస్తుతం ఆయన ‘స్వయంభూ’ చిత్రంలో నటిస్తున్నారు. దీనితో పాటు ‘ది ఇండియా హౌస్’ ‘కార్తికేయ-3’ చిత్రాలకు సన్నాహాలు చేసుకుంటున్నారు.