కథాంశాల్లో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తారు హీరో నాని. ప్రతి సినిమాలో తనని తాను వైవిధ్యంగా ఆవిష్కరించుకోవాలని తపిస్తారు. ఇటీవల విడుదలైన ‘దసరా’ చిత్రంలో ఊర మాస్ పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించారు. ప్రస్తుతం నాని తన 30వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మృణాల్ ఠాకూర్ కథానాయిక. ఈ ప్రాజెక్ట్ తర్వాత నాని ఓ థ్రిల్లర్ జోనర్ చిత్రంలో నటించబోతున్నట్లు తెలిసింది. దీనికి ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని తెలిసింది. ‘దృశ్యం’ ‘దృశ్యం-2’ చిత్రాలతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు జీతూ జోసెఫ్. ఆ చిత్రాల తరహాలోనే నాని సినిమా కోసం ఆయన ఓ డిఫరెంట్ థ్రిల్లర్ సబ్జెక్ట్ను సిద్ధం చేశారని చెబుతున్నారు.