‘సినిమా బాగుందని గత రెండు రోజులుగా అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తున్నది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చిత్రాన్ని ఆదరిస్తున్నారు. కామెడీతో పాటు థ్రిల్లింగ్ అంశాలతో అందరిని మెప్పిస్తున్నది’ అని చెప్పారు పద్మావతి గల్లా. ఆమె తనయుడు అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయమైన చిత్రం ‘హీరో’ ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం థాంక్స్మీట్ను ఏర్పాటు చేశారు. చిత్ర హీరో అశోక్గల్లా మాట్లాడుతూ ‘మొదటి రోజు హైదరాబాద్ దేవీ థియేటర్లో సినిమా చూశా. ప్రేక్షకులు ఆద్యంతం సినిమాను ఆస్వాదిస్తున్నారు. జగపతిబాబు, బ్రహ్మాజీ అద్భుతమైన పాత్రల్ని చేశారు. పాటలు, పోరాటఘట్టాలకు విజిల్స్ పడుతున్నాయి’ అని చెప్పారు.
‘ప్రేక్షకులను ఆసాంతం నవ్వించాలనే లక్ష్యంతో సినిమా చేశాం. సినిమాకొస్తున్న ఆదరణ చూసి మా ప్రయత్నం ఫలించినైట్లెంది. థియేటర్లలో నిజమైన పండుగలాంటి వాతావరణం కనిపిస్తున్నది. బ్రహ్మాజీ చివరి పది నిమిషాల్లో అదరగొట్టాడు’ అని చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెలిపారు. జగపతిబాబు మట్లాడుతూ ‘గత పదిహేనేళ్లుగా థియేటర్కు వెళ్లి సినిమా చూడలేదు. ఈ సినిమాకు వెళ్లాను. దర్శకుడు నా పాత్రను కొత్తగా తీర్చిదిద్దాడు. హీరో అశోక్లో నటన పట్ల తపన కనిపించింది. ప్రతి సీన్ గురించి ఎంతో శ్రద్ధ పెట్టాడు’ అని జగపతిబాబు చెప్పారు. కథ చెప్పినప్పుడే సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే విషయం అర్థమైందని నరేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.