‘చాలా విరామం తర్వాత బాస్ చిరంజీవిగారు పక్కా మాస్ ఎంటర్టైనర్ చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మ్యూజిక్ కొత్తగా ఉండేలా చూసుకున్నా’ అని అన్నారు దేవిశ్రీప్రసాద్. చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ‘చిరంజీవి, రవితేజ వంటి స్టార్స్ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి వాళ్లు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకున్నా. ‘పూనకాలు లోడింగ్’ ‘బాస్ పార్టీ’ ‘వీరయ్య టైటిల్ సాంగ్’..ఇలా అన్ని పాటలకు మంచి స్పందన లభిస్తున్నది.
ఈ సినిమా పాటలు విన్న తర్వాత చిరంజీవిగారు నాకు ఫోన్ చేసి ‘విశ్వరూపం చూపించావు’ అని ప్రశంసించారు. ఈ సినిమాలో చిరంజీవిగారు మనందరిని ఏడిపిస్తూ నవ్విస్తారు. నవ్విస్తూ ఏడిపిస్తారు. ఆయన యాక్టింగ్ మనందరి చేత థియేటర్లలో చప్పట్లు కొట్టిస్తుంది. ‘నాటు నాటు’ పాట ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకోవడం మనందరికి గర్వకారణం. తెలుగు పాట విశ్వవ్యాప్తమవుతున్నది. ‘పుష్ప’ పాటలు విదేశాల్లో కూడా పాపులర్ అయ్యాయి. దానిని దృష్టిలో పెట్టుకొని ‘పుష్ప-2’ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నా’ అన్నారు.