Anurag Kashyap | ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సహ-సీఈఓ టెడ్ సారండోస్పై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతదేశాన్ని అర్థం చేసుకోవడంలో సారండోస్ పూర్తిగా విఫలమయ్యారని, భారతీయ ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారనే విషయంపై నెట్ఫ్లిక్స్కు సరైన అవగాహన లేదని కశ్యప్ ఆరోపించారు. అంతేకాకుండా, నెట్ఫ్లిక్స్ ఇండియా కార్యాలయం ఇచ్చే తప్పుడు సమాచారాన్ని సారండోస్ నమ్ముతున్నారని ఆయన అన్నారు.
సారండోస్ ఇటీవల నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ, భారతదేశంలో “సేక్రెడ్ గేమ్స్” వంటి ప్రయోగాత్మక వెబ్ సిరీస్తో నెట్ఫ్లిక్స్ తన ప్రయాణాన్ని ప్రారంభించడం సరైన వ్యూహం కాదని అభిప్రాయపడ్డారు. దానికంటే ఏదైనా ప్రజాదరణ పొందిన కంటెంట్తో మొదలుపెట్టి ఉంటే బాగుండేదని ఆయన సూచించారు. సారండోస్ చేసిన ఈ వ్యాఖ్యలే అనురాగ్ కశ్యప్ను ఆగ్రహానికి గురిచేశాయి.
ఈ వ్యాఖ్యలను కశ్యప్ తన సోషల్ మీడియాలో తెలివితక్కువవిగా అభివర్ణించారు. నెట్ఫ్లిక్స్ ఇండియా “అత్తా కోడళ్ల సీరియళ్ల” (సాస్ బహు వంటి సీరియల్స్)తో ప్రారంభించి ఉంటే, అప్పుడు ఇంకా ఎక్కువ మంది చూసేవారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బాలాజీ టెలిఫిల్మ్స్తో నెట్ఫ్లిక్స్ భాగస్వామ్యాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారని కూడా ఆయన సూచించారు. నెట్ఫ్లిక్స్ ఇండియా దర్శకుల సృజనాత్మక స్వేచ్ఛను అణచివేస్తోందని, కేవలం వ్యాపార కంటెంట్ను మాత్రమే ప్రోత్సహిస్తోందని కశ్యప్ తీవ్రంగా విమర్శించారు. నెట్ఫ్లిక్స్ ఇండియా బృందం పనికిమాలిన వ్యక్తులతో నడుస్తోందని, వారు కేవలం అల్గారిథమ్లు, సబ్స్క్రిప్షన్లపై మాత్రమే ఆసక్తి చూపుతున్నారని, కంటెంట్పై దృష్టి పెట్టడం లేదని కశ్యప్ ఆరోపించారు.